Arun Jaitley Midnight Press Meet About Special Package
అర్ధరాత్రి 12:15 నిమిషాలకు మీడియా ముందుకు వచ్చిన చంద్రబాబు ముందుగా అరుణ్ జైట్లీ ప్రకటనను మరోసారి తనదైన శైలిలో వివరించారు. అనంతరం ఆ ప్రత్యేక ప్యాకేజీ ప్రకటనను అభినందిస్తున్నామని మొదలుపెట్టిన చంద్రబాబు.. కేంద్రం ప్రకటించినవన్నీ వీలైనంత త్వరగా రాష్ట్రానికి అందేలా చూడాలని కోరారు. ప్రత్యేక ప్యాకేజీ లో ప్రకటించినవి కాకుండానే ఇంకా చేయాల్సినవి చాలా ఉన్నాయని తెలిపారు. ఇదే సమయంలో పోలవరానికి ఇస్తామన్న 100% నిధులను ఏ విధంగా ఇస్తారో ఎప్పటిలోగా ఇస్తారో కూడా స్పష్టమైన ప్రకటన ఇవ్వాలని కేంద్రాన్ని కోరారు.
అమరావతి నిర్మాణానికి సంబందించి అరుణ్ జైట్లీ చెప్పినట్లు ఇప్పటివరకూ ఇచ్చిన రూ.2500 కోట్లు భవిష్యత్తులో ఇస్తామని ప్రకటించిన రూ. వెయ్యి కోట్ల నిధులు రాజధాని నిర్మాణానికి ఏమాత్రం సరిపోవని చంద్రబాబు ప్రకటించారు. నిర్ధిష్ట గడువులోగా జైట్లీ చేసిన ప్రకటనలోని హామీలన్నీ నెరవేర్చాలని ఈ ప్రకటనలకు చట్టబద్దత కల్పించాలని బాబు కోరారు. సురేష్ ప్రభు ప్రకటిస్తారని చెబుతున్న రైల్వే జోన్ విషయంలో.. విశాఖను రైల్వే జోన్ గా ప్రకటించాలని డిమాండ్ చేశారు.
"ఇప్పటికీ ప్రత్యేక హోదా కావాలనే అడుగుదాం.. టెక్నికల్ అంశాలను చూపిస్తూ హోదా ఇవ్వకపోయినా కూడా ఆస్థాయిలో ప్యాకేజీ ఇస్తామని కేంద్రం చెబుతుంది.. ఎంత ఇస్తే అంత తీసుకుందాం అలా కాకుండా మరేమి చేస్తాం" అని ఎదురు ప్రశ్నించిన చంద్రబాబు.. ఈ విషయంలో "కేంద్రం ఇచ్చిన ప్యాకేజీ వద్దు ప్రత్యేక హోదానే కావాలని మాట్లాడితే వచ్చేవి కూడా రావు" అని క్లారిటీగా చెప్పారు బాబు. దీంతో... ప్రత్యేక హోదాపై బాబు ఏమాత్రం పోరాటం చేయలేరని రాజీ పడి సర్ధుకుపోవడమే మేలని చెప్పకనే చెప్పారనే అనుకోవాలి!!
