ఆంధ్ర తెలంగాణ బ్రాండ్ వార్




ఏపీ, తెలంగాణల రాష్ట్రాల మధ్య రోజురోజుకూ కొత్తకొత్త వివాదాలు తలెత్తుతున్నాయి.  ఇప్పటికే ఇరు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల పంపకంపై రగడగా మారింది.  తాజాగా ప్రైవేట్ డెయిరీలకు ఎదురొడ్డి తన ప్రత్యేకతను చాటుకుంటున్న ప్రభుత్వ పాల ఉత్పత్తుల సంస్థ ‘ఏపీ పాడి పరిశ్రమాభివృద్ధి సమాఖ్య (ఏపీ డెయిరీ)’ ఉత్పత్తి చేస్తున్న ‘విజయ’ బ్రాండ్ పాలపై  రెండు రాష్ట్రాల మధ్య వివాదం చోటుచేసుకుంది. తెలుగు నేల రెండు రాష్ట్రాలుగా విడివడినా… విభజన చట్టంలోని తొమ్మిదో షెడ్యూల్ లో చేరిన ఏపీ డెయిరీ మాత్రం ఇంకా ఉమ్మడిగా కొనసాగుతోంది.  ఏపీ కేంద్రంగా పాల వ్యాపారం చేస్తున్న ఏపీ డెయిరీ ‘విజయ’ బ్రాండ్ పాలను తెలంగాణలోనూ విక్రయిస్తోంది.  అయితే.. తాజాగా తెలంగాణ ప్రభుత్వం కూడా అదే బ్రాండ్ పేరుతో పాల విక్రయం ప్రారంభించడంతో గొడవ మొదలైంది.

‘తెలంగాణ పాడి సమాఖ్య’ పేరిట ప్రత్యేక సంస్థను నెలకొల్పుకుని ‘విజయా’ బ్రాండ్ పేరిటే పాలను విక్రయిస్తోంది తెలంగాణ ప్రభత్వం.  ఆ బ్రాండ్ కు ‘తెలంగాణ’ అనే ట్యాగ్ లైన్ తగిలించింది. మరోవైపు  ఏపీ డెయిరీ… తెలంగాణలోని పాలమూరు జిల్లా కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న సాంబశివ డెయిరీ ప్రొడక్ట్స్ ఇండియా ప్రైవేటు లిమిటెడ్ కు తన పాలను పంపి అక్కడే ప్రాసెస్ చేయించి ‘విజయ’ బ్రాండ్ పేరిటే తెలంగాణలో పాలను విక్రయిస్తోంది.  ఈ క్రమంలో సాంబశివ డెయిరీ నుంచి వస్తున్న ‘విజయ’ బ్రాండ్ తమది కాదని మొన్న తెలంగాణ పాడి సమాఖ్య ఓ కీలక ప్రకటన విడుదల చేసింది. ఈ ప్రకటనకు కౌంటర్ గా నిన్న ఏపీ డెయిరీ  మరో ప్రకటన విడుదల చేసింది.  సాంబశివ డెయిరీ నుంచి విడుదలవుతున్న ‘విజయ’ బ్రాండ్ పాలు నకిలీవి కావని, వాటిలో ఎలాంటి కల్తీ లేదని పేర్కొన్నారు.

ఇలా రెండు డెయిరీలు ఒకటే బ్రాండు పేరుతో విక్రయిస్తూ కొనుగోలుదారుల్లో గందరగోళం సృష్టిస్తున్నారు. విజయ డెయిరీ పాలు బాగా పాపులర్ కావడంతో ఆ బ్రాండ్ నేమ్ కోసమే తెలంగాణ ప్రభుత్వం ఇలా చేసిందని తెలుస్తోంది. ఇప్పడు రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న బ్రాండ్ నేమ్ వివాదం ముఖ్యమంత్రుల వద్దకు కూడా చేరిందట. మరి దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.
ThanQ Visit Again.

Related Posts