ఇండియన్ అఫ్ ది ఇయర్ 2015 అవార్డుకు ఎంపికైన రాజమౌళి




ఓ వైపు జాతీయ ఉత్తమ చిత్రంగా కేంద్ర ప్రభుత్వ అవార్డు.. మరోవైపు పద్మశ్రీ పురస్కారం.. తాజాగా సీఎన్ ఎన్ ఐబీఎన్ ‘ఇండియన్ ఆఫ్ ద ఇయర్’.. మొత్తానికి మన రాజమౌళి జాతీయ స్థాయిలో తెలుగు జెండాను రెపరెపలాడించేస్తున్నాడు. లేటెస్టుగా అందుకున్న ‘ఇండియన్ ఆఫ్ ద ఇయర్’ అవార్డు ఇచ్చింది ఓ టీవీ ఛానెల్ కాబట్టి దీన్ని లైట్ తీసుకోవాల్సిన పని లేదు. ఈ అవార్డును చాలా ప్రతిష్టాత్మకంగానే భావిస్తారు. ఎక్కువగా బాలీవుడ్ వాళ్లకే పట్టం కట్టే ఈ ఛానెల్.. తీవ్ర పోటీ ఉన్నప్పటికీ మన రాజమౌళిని ఈ అవార్డుకు ఎంపిక చేయడమంటే మామూలు విషయం కాదు. సంజయ్ లీలా బన్సాలీ (బాజీరావ్ మస్తానీ).. ప్రియాంక చోప్రా (బాజీరావ్ మస్తానీ-దిల్ దడ్కనే దో).. రణ్వీర్ సింగ్ (బాజీరావ్ మస్తానీ-దిల్ దడ్కనే దో).. ‘పీకూ’ టీమ్.. ‘తల్వార్’ టీమ్.. ఇలా రాజమౌళికి పోటీ తీవ్రంగానే ఉంది. అయినప్పటికీ మన జక్కన్నే పురస్కారానికి ఎంపికయ్యాడు.

ఇక అవార్డు అందుకున్న అనంతరం మాట్లాడుతూ తనకీ పురస్కారం ఇవ్వడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్లు చెప్పాడు రాజమౌళి. తనకు ఒక్కడికి కాకుండా.. బాహుబలి టీంకు ఈ అవార్డు ఇస్తే చాలా సంతోషించేవాడినని.. ‘బాహుబలి’ లాంటి సినిమా టీం వర్క్ వల్లే సాధ్యమైందని.. ఇందుకోసం అందరూ ఎంతో శ్రమించారని రాజమౌళి చెప్పాడు. ఈ మాట అనగానే ఆడిటోరియం అంతా చప్పట్లతో మార్మోగింది. ఈ అవార్డుకు రాజమౌళి పేరును కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించారు. ఇక చివర్లో ప్రముఖ క్రిటిక్.. సీఎన్ ఎన్ ఐబీఎన్ ఛానెల్ ప్రతినిధి రాజీవ్ మసంద్ మైక్ అందుకుని బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడో చెప్పమని అడగ్గా అది చెప్పలేనని.. అందుకోసం ఇంకో ఏడాది ఆగితే సరిపోతుందని చెప్పి అక్కడి నుంచి నిష్క్రమించాడు జక్కన్న.
ThanQ Visit Again.

Related Posts