దుబాయ్: క్రికెట్ దిగ్గజాలు సచిన్ టెండూల్కర్, షేన్ వార్న్ అమెరికాలో నిర్వహించ తలపెట్టిన మూడు మ్యాచ్ల టీ20 సిరీస్కు అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) ఆమోదం తెలిపింది. సచిన్, వార్న్లతో చర్చలు జరిపిన అనంతరం ఐసిసి ఈ ప్రతిపాదనకు ఆమోదముద్ర వేసింది. ముఖ్యంగా సచిన్ ప్రత్యేక చొరవ చూపడం వల్లనే ఐసిసి ఈ ప్రతిపాదనను ఆమోదించినట్లు తెలుస్తోంది. ‘ఈ ఏడాది నవంబర్లో జరిగే ఏకైక క్రికెట్ ఈవెంట్ ఇదే. అందువల్ల ఐసిసికి ఎటువంటి ఇబ్బందీ లేదు. అయినప్పటికీ ఐసిసి విధించిన కొన్ని షరతులకు కట్టుబడి ఉండేందుకు సచిన్, వార్న్ అంగీకరించడంతో వారి ప్రతిపాదనకు ఆమోదం లభించింది' అని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్కు చెందిన ఒక అధికారి తెలిపాడు. అమెరికా క్రికెట్ సంఘం అనుబంధాన్ని ఇటీవల రద్దు చేసిన ఐసిసి ఆ దేశంలో క్రికెట్ వ్యవహారాలను పర్యవేక్షించేందుకు కొత్త విభాగాన్ని ఏర్పాటు చేసింది.

సచిన్, వార్న్ ట్వంటీ-20 లీగ్లో మూడు మ్యాచ్ల ద్వారా లభించే ఆదాయంలో కొంత సొమ్మును ఐసిసికి చెల్లించడం జరుగుతుందని, ఈ మొత్తాన్ని అమెరికాలో క్రికెట్ అభివృద్ధికి వినియోగించడం జరుగుతుందని తెలుస్తోంది.
కాగా, సచిన్, వార్న్లతో పాటు రాహుల్ ద్రావిడ్, వివిఎస్ లక్ష్మణ్, సౌరవ్ గంగూలీ, మెక్గ్రాత్, గిల్క్రిస్ట్, కలిస్, బ్రియన్ లారా, వసీం అక్రమ్ వంటి మాజీ స్టార్లు ఈ టోర్నీలో ఆడనున్నారు.