ఏటీఎంల‌లో న‌కిలీ నోట్లు వస్తే ఏం చేయాలి ?




ఒక‌ప్పుడంటే బ్యాంక్‌లో ఉన్న డ‌బ్బులు డ్రా చేయాలంటే బ్యాంక్‌కు వెళ్లి, ఫాం నింపి క్యాషియ‌ర్‌కి ఇస్తే కొంత సేపు వెయిట్ చేసిన త‌రువాత లైన్‌లో నిల‌బ‌డి డ‌బ్బులు తీసుకోవాల్సి వ‌చ్చేది. కానీ ఇప్పుడు అలా కాదు. అధునాతన సాంకేతిక ప‌రిజ్ఞానంతో కూడిన ఏటీఎంలు వ‌చ్చేశాయి. అవి ఎక్క‌డ ప‌డితే అక్క‌డ మ‌న‌కు అందుబాటులో ఉంటున్నాయి. అయితే వాటిలో డ‌బ్బులు డ్రా చేసేందుకు య‌త్నించిన‌ప్పుడు డ‌బ్బులు అకౌంట్ నుంచి క‌ట్ అయి కూడా మెషీన్ నుంచి బ‌య‌ట‌కు రాక‌పోతే చిన్న కంప్లెయింట్ ఇచ్చి మ‌న డ‌బ్బును మ‌నం తిరిగి పొందేందుకు వీలుంది. దీంతో ఎలాంటి స‌మ‌స్యా లేదు. కానీ ఈ మ‌ధ్య ఏటీఎంల‌లో న‌కిలీ నోట్లు వ‌స్తున్నాయి. వాటిని తీసుకున్న వినియోగ‌దారులు బ్యాంకుకు వెళ్తే బ్యాంక్ వారు త‌మ‌కేం తెలియ‌ద‌ని స‌మాధానం చెప్ప‌డం, దీంతో బాధితులు గ‌గ్గోలు పెట్ట‌డం ఇప్పుడు స‌ర్వ సాధార‌ణం అయింది. అయితే మీకు తెలుసా? ఏటీఎంల‌లో న‌కిలీ నోట్లు వ‌చ్చినా వాటిని తిరిగి ఇచ్చి బ్యాంకుల ద్వారా అస‌లైన నోట్లు పొంద‌వ‌చ్చ‌ని. అవును, మీరు విన్న‌ది నిజ‌మే. ఇలాంటి స‌మ‌స్య ఎదుర‌య్యే వారు ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం.
ఏటీఎంలో న‌కిలీ నోట్లు రాగానే కంగారు ప‌డ‌కూడ‌దు. వెంట‌నే అప్ర‌మ‌త్త‌మై అక్క‌డ ఉండే సెక్యూరిటీ గార్డుకు ఈ విష‌యాన్ని తెలియ‌జేయాలి. ఇటీవ‌లి కాలంలో దాదాపు అధిక శాతం ఏటీఎంల వ‌ద్ద సెక్యూరిటీ గార్డులు ఉంటున్నారు. కాబ‌ట్టి న‌కిలీ నోట్లు రాగానే ఆ గార్డుకు విష‌యం చెప్పి అత‌ని వ‌ద్ద ఉండే రిజిస్ట‌ర్‌లో మీరు డ్రా చేసిన మొత్తం, న‌కిలీ నోట్లు ఎన్ని వ‌చ్చాయి, ఏయే నోట్లు వ‌చ్చాయి, వాటి నంబ‌ర్లు, మీరు లావాదేవీ నిర్వ‌హించిన స‌మ‌యం, తేదీ, ఏటీఎం స్లిప్, దాని ట్రాన్‌సాక్ష‌న్ నంబ‌ర్‌ వంటి వివ‌రాలను అన్నింటిని ఆ రిజిస్ట‌ర్‌లో ఎంట‌ర్ చేసి గార్డు సంత‌కం తీసుకోవాలి. వీలైతే ఇప్పుడు చెప్పిన వివ‌రాల‌కు సంబంధించిన ఫొటోల‌న్నింటినీ స్మార్ట్‌ఫోన్
ద్వారా తీసి భ‌ద్ర ప‌రుచుకోవాలి. అనంతరం పైన చెప్పిన ఆయా వివ‌రాల‌కు సంబంధించిన జిరాక్స్ ప్ర‌తుల‌ను తీసి బ్యాంక్‌కు వెళ్లి అక్క‌డి మేనేజ‌ర్‌కు ఫిర్యాదు చేయాలి. బాధితుడు తాను చేసిన లావాదేవీకి సంబంధించిన పూర్తి వివ‌రాల‌తో కూడిన ఓ లెట‌ర్‌ను రాసి మేనేజ‌ర్‌కు ఇవ్వాలి. దానికి ముందు చెప్పిన జిరాక్స్ ప్ర‌తుల‌ను కూడా ఇవ్వాలి. బ్యాంక్ వారు మీ ద‌గ్గ‌ర ఉన్న న‌కిలీ నోట్ల‌ను తీసుకుని వాటిని త‌మ ద‌గ్గ‌ర ఉండే ప‌రిక‌రాల ద్వారా స్కాన్ చేసి అవి నకిలీ నోట్ల‌నే విష‌యాన్ని ధృవ ప‌రుస్తారు. అనంత‌రం వాటికి బ‌దులుగా మీకు అంతే మొత్తంలో డ‌బ్బును ఇస్తారు.
ఆర్‌బీఐ నిబంధ‌న‌ల ప్ర‌కారం ప్ర‌తి బ్యాంక్ పైన చెప్పిన విధంగా చేయాల్సి ఉంటుంది. ఒక‌వేళ ఏ బ్యాంక్ అయినా స్పందించ‌క‌పోతే స్థానిక పోలీస్ స్టేష‌న్‌లో ఫిర్యాదు చేసే హ‌క్కు బాధితునికి ఉంటుంది. అంతేకాదు త‌దుప‌రి చ‌ర్య‌గా బాధితుడు ఆర్‌బీఐ సైట్‌(www.rbi.org.in)లో ఉన్న మెయిల్ ఐడీకి త‌మ ఫిర్యాదుతో కూడిన లేఖ‌ను మెయిల్ రూపంలో పంపించ‌వ‌చ్చు. లేదంటే స్థానికంగా ఉన్న బ్యాంకింగ్ అంబుడ్స్‌మ‌న్‌కు ఫిర్యాదు చేయ‌వ‌చ్చు. అలా ఇచ్చిన ఫిర్యాదుకు ఆర్‌బీఐ లేదా బ్యాంకింగ్ అంబుడ్స్‌మ‌న్ అధికారులు స్పందించి త‌క్ష‌ణ‌మే చ‌ర్య తీసుకుంటారు. బాధితునికి త‌గిన న్యాయం చేస్తారు. ఇప్పుడు తెలుసుకున్నారుగా, ఏటీఎంల‌లో న‌కిలీ నోట్లు వ‌స్తే ఏం చేయాలో. ఈ స‌మాచారాన్ని మ‌రింత మందికి షేర్ చేయడం మ‌రిచిపోకండి. దీని వ‌ల్ల న‌కిలీ నోట్ల‌ బాధితులు ఎవ‌రైనా ఉంటే వెంట‌నే త‌మ స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించుకోగ‌లుగుతారు

ThanQ Visit Again.

Related Posts