దొంగ బాబా దొరికాడు - ఇలాంటి వాళ్ళు ఇంకేందరో !!



లైఫ్ స్టైల్ భవన యజమాని మధుసూదన్ రెడ్డిని మోసం చేసిన దొంగ బాబా అలియాస్ పరమాన్నం బాబా ఉరఫ్ శివను టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. డబ్బుల్ని డబుల్ చేస్తానంటూ మాయ చేసి ముగ్గులోకి దించి.. రూ.1.30కోట్లతో ఉడాయించిన అతగాడ్ని స్వల్ప వ్యవధిలో హైదరాబాద్ పోలీసులు చాకచక్యంగా అదుపులోకి తీసుకోవటమే కాదు.. మొత్తం కుట్రను చేధించారు.

తాజాగా అతడ్ని నాంపల్లి న్యాయస్థానంలో హాజరు పర్చారు. ఈ కేసు పూర్వాపరాలు పరిశీలించిన న్యాయమూర్తి.. శివకు 14 రోజులు రిమాండ్ విధిస్తూ ఆదేశాలు జారీ చేశారు. దీంతో.. అతన్ని చంచలగూడ జైలుకు తరలించారు. మాయమాటలు చెప్పి.. కొత్త ఆశలు రేపిన ఇలాంటి స్వాములకు కఠిన శిక్షలు విధించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.


సంపన్నుల్ని.. పలువురు ప్రముఖుల్ని తన మాటలతో బోల్తా కొట్టించే పరామాన్నం బాబా యవ్వారాల్ని త్వరగా ఎలా నమ్మేవారు? వారిని ఎలా నమ్మించేవారు? అన్నది పెద్ద ప్రశ్న. తాజాగా అతన్ని విచారించిన పోలీసులకు షాకిస్తూ.. తాను బురిడీ కొట్టే విధానాన్ని పరమాన్నం బాబా అలియాస్ శివ వివరంగా చెప్పుకొచ్చాడు. తనను నమ్మి పెద్ద మొత్తంలో డబ్బు ఎలా పెడతారన్న ప్రశ్నతో పాటు.. ఎలా నమ్మకం కలిగిస్తాడన్న అంశాన్ని చూస్తే..

తనకు పరిచయమై.. తన మాటల ప్రభావానికి గురై.. తనతో పూజ చేయించుకునే వారికి డెమో పేరుతో మొదట ఎరవేస్తాడు. ఇందులో భాగంగా మొదట కొద్దిపాటి మొత్తాన్ని పూజలో పెట్టటం.. దాన్ని తన దగ్గరఉన్న డబ్బుతో డబుల్ చేసి.. వారిలో ఆశలు పెంచేలా చేసి.. వారిని మాయలో ఉంచేసి మాయమైపోవటం శివకు అలవాటు.

డబ్బుల్ని డబుల్ చేసే విషయంలో తన క్లయింట్లను శివ ఎలా నమ్మిస్తాడన్నది చూసినప్పుడు ఈ వ్యవహారం ఆసక్తికరంగా అనిపించక మానదు. పూజ సమయంలో లుంగీ కట్టుకునే పరమాన్నం బాబా.. పూలు.. రబ్బర్ బ్యాండ్లతో డబ్బుల్ని తొడల దగ్గర కట్టుకుంటాడు. పూజలో కూర్చొన్న కాసేపటికి.. క్లయింట్ల చూపుల్ని మరల్చి.. రబ్బర్ బ్యాండ్లను తొలగించి.. తొడల దగ్గర పెట్టుకున్న డబ్బును పూజలో ఉంచిన డబ్బుకు జత చేస్తాడు. అనంతరం వారు తన ట్రాప్ లో పడ్డాక.. తర్వాతి పూజలో పెద్ద మొత్తాన్ని పెట్టటం.. దాన్ని మాయ మాటలు చెప్పేసి ఉడాయించేస్తాడట.
ThanQ Visit Again.

Related Posts